ప్రభువునెరిగిన భక్తి

యోబుకు కష్టాలు ఒక్కసారిగా ఉప్పెనలా వచ్చి పడ్డాయి. ఆస్తి నష్టమే కాదు, ఆరోగ్యమూ ఆవిరైపోయింది. బిడ్డల్ని పోగొట్టుకున్న కడుపు కోత పిండేస్తోంది. ఆదరించాల్సిన స్నేహితులు అనరాని మాటలు అంటున్నారు. భార్య సహకారం అంతంత మాత్రమే. అంతటి భాగ్యవంతుడు, భక్తుడు ఒక్కసారిగా ఏకాకి అయిపోయాడు. దేవుడు కూడా వదిలేశాడా అనిపించే నిరాశ, నిస్పృహ ఆవహిస్తున్న పరిస్థితి. కానీ యోబులో ఆశ చావలేదు. అతనిలోని భక్తుడు ఇంకా బ్రతికే ఉన్నాడు. అతని విశ్వాసం అంతరించి పోలేదు. అతడు దేవుడ్ని అనుమానించ లేదు. “నా విమోచకుడు సజీవుడు” అంటున్నాడు. ఆయన్ని “నేను ఎరుగుదును” అంటున్నాడు. నా చర్మం చివికిపోయినా సరే, ఈ దేహంలోనే ఆయన్ను చూస్తాను. నా మట్టుకు నేనే చూస్తాను. నా దేవుడ్ని నా కన్నులారా చూస్తాను. నా రక్షకుడు వస్తాడు. నా పక్షాన నిలుస్తాడు —అంటున్నాడు యోబు (19.25-27).

మా, తుజే సలాం

తల్లిని ప్రేమించడం, గౌరవించడం ‘మదర్స్ డే’ కి పరిమితం కాకూడదు. ఆమె మన బ్రతుకంతటికీ తల్లి—చిన్నప్పుడు పెద్ద వాళ్ళమైనప్పుడు, మనకు పెళ్లి అయ్యాక పెళ్లి కాకమునుపు, ఆమె మనకు సాయం చేసేటప్పుడు, మన సాయం ఆమెకు అవసరం అయినప్పుడు—అమ్మ మనకు అమ్మే! దేవుడి తర్వాత—అమ్మ మనకంత విలువైనది, ఆమె ప్రేమ అంత పవిత్రమైనది, ఆమె అంత గౌరవం పొందతగింది.

సత్యారాధన

సమరయ స్త్రీతో సంభాషణలో ప్రభువు చెప్పిన మాట ఇది. సమరయులు తెలియక ఆరాధిస్తారని, యూదులు తెలిసి ఆరాధిస్తారని చెప్పారాయన. అజ్ఞానం ఆరాధనకు గొడ్డలి పెట్టు. అది దేవుడ్ని అపార్థం చేసుకుంటుంది. ఆ అపార్థం దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడానికి ఊతమిస్తుంది. అలా అజ్ఞానం ఆరాధనను పేలవంగా మార్చడమే గాక, దాన్ని పక్కదోవ పట్టించి చివరికి విగ్రహారాధనకు నడిపిస్తుంది. ఇదంతా తెలియకుండానే జరిగిపోతుంది. దేవుడ్ని తప్పుగా ఊహించుకోవడమే విగ్రహారాధనకు పునాది. అటు యూదుల చరిత్ర, ఇటు సమరయుల చరిత్ర ఈ సత్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.

క్రైస్తవ ఇంగితం

“ఇంగితం” లేక “ఇంగిత జ్ఞానం” మనిషికి దేవుడిచ్చిన గొప్ప వరం. ఇంగ్లిష్ లో దీన్ని “కామన్ సెన్స్” అంటారు. ఇది మనుషులందరికీ అందుబాటులో ఉంటుంది గనుక దీన్ని అలా పిలిచారు. సృష్టిలో జంతువులకు లేని ఇంగిత జ్ఞానం మనిషికి దొరికింది. దేవుని పోలికలో పుట్టిన మనిషికి ఇది సహజంగానే అబ్బింది. ఇంగిత జ్ఞానం దేవుని పోలికలో అంతర్భాగం. అందుకే దేవుడు ఇంగిత జ్ఞానానికి వ్యతిరేకి కాదు.

క్రీస్తే మూలం

మార్పు లోకంలో సహజం. కాలం మారుతుంది. విశ్వంలో ప్రతీ వస్తువు మార్పుకు లోనౌతుంది. నక్షత్ర రాశులు స్థానభ్రంశం చెందుతూనే ఉంటాయి. నక్షత్రాలు మండిపోతూ ఉన్నాయి. సూర్యుడి సైజూ క్రమేపీ తగ్గిపోతూ ఉంది. వాతావరణం విపరీత మార్పులకు గురవుతూ వస్తోంది. మనుషులూ, వారి ఆరోగ్య పరిస్థితులూ, వారి వ్యవస్థలూ, విలువలూ, సంబంధాలూ అన్నీ నిత్యం మారుతున్న విషయాలే. మన దేశంలో ఐతే మనం అనాదిగా మన దేవుళ్లనూ మార్చుకుంటూ వస్తున్నాం.

అందరికీ మంచి చేద్దాం

క్రైస్తవం స్వార్థ పరాయణత్వంతోనో, మత మౌఢ్యంతోనో ఆవిర్భవించిన విశ్వాసం కాదు. క్రైస్తవం ఇచ్చి వేసుకునే విశ్వాసం. ఆదిమ సంఘంలో విశ్వాసులు తమలోని అక్కర ఉన్న ప్రతి ఒక్కరికీ ఆస్తులను పంచి పెట్టారు(అపో.2.44-45). మన దేవుడు ఇచ్చే దేవుడు, నిలువు దోపిడీ చేసే దేవుడు కాదు. మన దేవుడు లోకాన్ని ప్రేమించి, లోక రక్షణ కోసం తన ఏకైక కుమారుణ్ణి ఇచ్చివేసిన దేవుడు (యోహా. 3.16). తాను దొంగిలించడానికి రాలేదని, ప్రాణాన్ని పణంగా పెట్టడానికి వచ్చానని, పరిపూర్ణ జీవితాలను ప్రసాదించడానికి వచ్చానని చెప్పారు మన ప్రభువు (యోహా. 10.10-16). ఆయన మన కోసమే కాదు. లోకమంతటి కోసం సిలువలో ప్రాణత్యాగం చేశాడని వాక్యం చెబుతోంది (1 యోహా. 2.2). ఐనా ఎందుకోగానీ, త్యాగపూరిత దాతృత్వం భారతీయ క్రైస్తవులకు ఇంకా అబ్బలేదు. మణిపూర్ బాధితులకు మీరెంత సాయం చేశారు అని మొన్నీమధ్య ఒక ధనిక క్రైస్తవ వర్గాన్ని ప్రశ్నించాను. ఎవరూ జవాబు చెప్పలేదు.

భక్తి – తృప్తి

“భక్తి” అంటే వల్లమాలిన ప్రేమ. గౌరవ ప్రదమైన ప్రేమ. “దైవ భక్తి” అంటే దేవుడ్ని ప్రేమించడం. దేవుడ్ని సమున్నతంగా, సంపూర్ణంగా ప్రేమించడం. అన్నింటికీ మించి, అందరికీ మించి నా సర్వస్వాన్ని అర్పిస్తూ ఆయన్ను ప్రేమించడం. ఇలాంటి భక్తిలో సంతోషం, సంతృప్తి సహజంగానే ఉంటాయి. ఈ భక్తి గొప్ప లాభాన్ని చేకూరుస్తుంది. శాశ్వత ఆశీర్వాదాన్ని మన సొంతం చేస్తుంది.

అద్వితీయ ప్రేమ!

ఈ మధ్య ఓ నాస్తిక శిఖామణి “దేవుడు ప్రేమోన్మాది” అన్నాడు. నన్నే ప్రేమించు, నాకన్నా ఎక్కువగా ఎవర్నీ ప్రేమించకు అనడం ఉన్మాదం కాక మరేంటి—అన్నది అతని వాదన. ఓ పక్క దేవుడే లేడంటూ మరో పక్క ఆయన్ని తిట్టడం ఎంత హాస్యాస్పదం! లేని దేవుడ్ని ఎలా తిడతావయ్యా “హేతు వాదీ”! నీ తిట్లు నిజమైతే దేవుడు ఉన్నట్టే కదా సామీ!

వినయ విధేయ విశ్వాసం

నేటి క్రైస్తవంలో చాలా మంది విశ్వసించడమంటే మతం పుచ్చుకోవడమో, బాప్తీస్మం తీసుకోవడమో, నిర్ధారణ తీసుకోవడమో లేక స్వస్థత కోసమో, అద్భుతాల కోసమో ప్రార్థన చేయించుకోవడమో అనుకుంటున్నారు. దానికి తోడు మన అయ్యగార్ల ప్రసంగాలూ అలానే ఉన్నాయి. విశ్వాసమంటే పూర్తిగా ఆధారపడటం, ఆనుకుపోవడం. ఈ విశ్వాసం ఒక అయ్యగారి ప్రార్థన పైనో, ఆయన ఇచ్చే నూనె బుడ్డి పైనో, ఒక సంఘ నియమం పైనో, ఒక సిద్ధాంతం పైనో కాదు. ఈ విశ్వాసం ఒక విలక్షణమైన వ్యక్తి పైన! దేవునికి నరునికి మధ్య ఉన్న అనంత అగాధాన్ని పూడ్చ గల్గిన దైవమానవుడైన క్రీస్తు పైన. దేవునికి మనిషికి మధ్య ఉన్న పాప గోడను కూల్చ గల్గిన సిలువ వేయబడిన క్రీస్తు పైన. మనిషిని పాపమరణాల దాస్యం నుండి విడిపించ గల్గిన మృత్యుంజయుడైన క్రీస్తు పైన. విశ్వాసానికి కారకుడు, దాన్ని పరిపూర్తి చేసేవాడూ ఐన క్రీస్తు పైనే మన విశ్వాసం (హెబ్రీ.12.1). ఈ విశ్వాసమే మనిషిని పాపం నుంచి విడిపిస్తుంది (1 యోహా.2.1-2).

చాలినంత కృప!

అందుకు– నా కృప నీకు చాలును, బలహీనతయందు నాశక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నామీద నిలిచియుండు నిమిత్తము, విశేషముగా నా బలహీనతలయందే బహు సంతోషముగా అతిశయపడుదును.
—2 కొరిం. 12.9

“నా కృప నీకు చాలును”. ఈ మాట మీద అనేక క్రైస్తవ పాటలు రాశారు. ప్రసంగాలూ చేశారు. ఇది క్రైస్తవుల నోట అతి విరివిగా వినబడే మాట. కానీ ఎందరికి దేవుని కృప నిజంగా తెలుసు? క్రీస్తు కృప పైన పౌలులా ఆధారపడే వాళ్ళు ఎందరు? లౌకిక, భౌతిక విషయాల్లో కాకుండా క్రీస్తు కృపలో అతిశయించే క్రైస్తవులు ఎందరు?